గంగమ్మ ఒడికి చేరిన గణపయ్య !

తెలుగు న్యూస్ టుడే ➤ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గణేష్‌ నిమజ్జన వేడుకలు అంబరాన్నితాకాయి. ఓ వైపు బ్యాండు మేళాలు..డీజే హోరు..తీరైన నృత్యాలు..కోలాటాలు..చిత్ర, విచిత్ర వేషధారణలు..భక్తుల జయజయధ్వానాలు..డప్పు కళాకారుల ఆటా..పాట, గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య భాగ్యనగరం నుంచీ అటు విజయనగరం వరకూ అంగరంగ వైభవముగా వేలాదిగా తరలి వచ్చిన గణపతి ప్రతిమలను నిమజ్జనం చేశారు నిర్వాహకులు . ఆదివారం నుంచీ సోమవారం వరకూ సాగిన ఈ శోభాయాత్రలో గణేష్‌ నిమజ్జన వేడుకలు అంబరాన్నితాకాయి. బాలాపూర్‌ నుంచి ఉదయం 11 గంటలకు మొదలైన శోభాయాత్ర చాంద్రాయణగుట్ట..ఫలక్‌నుమా..అలియాబాద్, శాలిబండ..చార్మినార్‌..అఫ్జల్‌గంజ్, మోజంజాహీ మార్కెట్‌ మీదుగా హుస్సేన్‌సాగర్‌కు చేరుకుంది. బాలాపూర్‌ గ్రామంలో లడ్డూ వేలంపాట ముగిసిన అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో శోభాయాత్ర సాగింది. మార్గమధ్యంలో గణేష్‌ ఉత్సవ కమిటీలు ఏర్పాటుచేసిన స్వాగత మండపాలు, అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. నిమజ్జనంలో పాల్గొన్న భక్తజనం ఆకలి తీర్చేందుకు బాలాపూర్‌ మొదలుకొని హుస్సేన్‌సాగర్‌ వరకు వివిధ రకాల అల్పాహారం, ఆహారపదార్థాలతోపాటు, మంచినీరు, మజ్జిగను పలు భక్తసమాజాలు ఉచితంగా పంపిణీ చేశాయి. జలమండలి శోభాయాత్ర జరిగే మార్గంలో 101 వాటర్‌క్యాంపులు ఏర్పాటుచేసి 30 లక్షల మంచినీటిప్యాకెట్లను పంపిణీ చేసింది. ఈ నిమజ్జనంలో పాల్గొన్న భక్త జనం మళ్ళీ వచ్చే ఏడాది చవితి వరకు ఈ సందడిని గుర్తుచేసుకునేలా గణపయ్యను మనసారా దీవించామని వేడుకుందాం !

Leave a Comment