వరంగల్ వెటర్నరీ కాలేజీ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి !

తెలుగు న్యూస్ టుడే ➤ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ను విద్యాహబ్‌గా మార్చేందుకు కృషిచేస్తున్నదని, మామునూరులో వెటర్నరీ కాలేజీని ప్రారంభించుకోవడం మరో ముందడుగు అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ కాలేజీలో త్వరలోనే రెగ్యులర్ పోస్టుల నియామకం చేపడుతామన్నారు. సోమవారం ఆయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మామునూర్‌లో పీవీ నరసింహా రావు తెలంగాణ పశువిశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వెటర్నరీ కాలేజీని ప్రారంభించారు. 40 మంది విద్యార్థులతో ప్రారంభమవుతున్న ఈ కళాశాల తెలుగు రాష్ట్రాలకు దిక్సూచిగా నిలువాలని ఆకాంక్షించారు. గత ఏడాదే దీనిని ప్రారంభించాలని అనుకున్నా.. వెటర్నరీ కౌన్సిల్‌ఆఫ్ ఇండియా అనుమతులు రావడంలో జాప్యం వల్ల ఇప్పుడు ప్రారంభిస్తున్నామని వివరించారు. వరంగల్ నగరాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ అమలులో భాగంగానే ప్రభుత్వం ఈ కాలేజీని మంజూరు చేసినట్టు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలను వరంగల్‌లో నెలకొల్పేందుకు సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.

Leave a Comment