విశాఖ మన్యంలో మావోల ఘాతుకానికి అరకు ఎమ్మెల్యేల బలి !

తెలుగు న్యూస్ టుడే ➤ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మన్యంలో అరకు ఎమ్మెల్యేల జంట హత్యలపై మరోసారి ఉలిక్కిపడింది . మావోయిస్టు లు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చిచంపారు. ఆదివారం విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ మండలం లిప్పిట్టిపుట్ట వద్ద ఈ ఘటన జరిగింది. మావోయిస్టుల దాడిని విశాఖపట్నం ఎస్పీ రాహూల్‌దేవ్ నిర్ధారించారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 60 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నారని భావిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు గతంలో పలుమార్లు హెచ్చరించారని, ఆయన క్వారీ విషయంలోనూ బెదిరింపులు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. కిడారి సర్వేశ్వరరావు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున అరకు ఎమ్మెల్యేగా గెలిచారు. కొంతకాలం కిందట టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ మృతిపట్ల గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Leave a Comment